ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్లు కూల్చివేతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. సోమవారం ఖమ్మం నగరంలోని అంబేడ్కర్ భవనంలో వెలుగుమట్ల ప్రాంతానికి చెందిన బాధితులను ఆమె పరామర్శించారు. వారి సమస్యలను స్వయంగా విని ధైర్యం చెప్పారు. బాధిత మహిళలు తమ పరిస్థితిని వివరించగా కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధితుల పరిస్థితి చూస్తే మనసు కలిచివేస్తుందని అన్నారు. పరీక్షల సమయంలో పిల్లలు చదువుకుంటున్న సమయంలోనే రాత్రికి రాత్రే బుల్డోజర్లతో ఇళ్లు కూల్చివేయడం బాధాకరమని పేర్కొన్నారు. పుస్తకాలు, చదువు సామగ్రి కూడా బయటపడేలా ఇళ్లను నేలమట్టం చేయడం అన్యాయమని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబాలు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని తెలిపారు.
